మాదక ద్రవ్యాలు విక్రయిస్తే చర్యలు
మొయినాబాద్: మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మొయినాబాద్ ఎస్సై నర్సింహారావు హెచ్చరించారు. గురువారం రాత్రి మొయినాబాద్ పోలీస్ష్టేషన్ పరిధిలోని అజీజ్నగర్, హిమాయత్నగర్, చిలుకూరు ప్రాంతాల్లో డాగ్స్క్వాడ్ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానిత వ్యక్తులు, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
ప్రహరీ అక్రమ నిర్మాణం తొలగింపు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ మండల కార్యాలయం వెనుక ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం బ్యూటిఫికేషన్ పేరుతో రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టింది. గమనించిన స్థానికులు గురువారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. వెంటనే స్పందించిన అధికారులకు మాలల ఐక్య వేదిక నాయకుడు బేర బాలకిషన్ కతజ్ఞతలు తెలిపారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా ఇలాగే అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
షాద్నగర్రూరల్: ప్రతి రోజు యోగ సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పతంజలి యోగా సమితి వ్యవస్థాపకుడు పానుగంటి శశిధర్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలలో భాగంగా గురువారం పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగ ఎంతో అవసరమని అన్నారు. ప్రతిఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, యువత, మహిళలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సీనియర్ యోగా సాధకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
జీవితంపై విరక్తితో..
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు రైల్వే స్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మాణిక్నగర్కు చెందిన రాము(35) పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య యశోదతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రామును ఆర్థిక, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్పైకి వస్తుండగా రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని రైల్వే పోలీసులు తెలిపారు.