నారీ.. పతుల భేరి
● సతుల గెలుపునకు పతుల వ్యూహాలు
● జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం
● ప్రధాన పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ
చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. గడువు ముగుస్తుండంతో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో వినూత్నంగా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు వార్డుల వారీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. మరి కొందరైతే ప్రజల సమస్యలను తెలుసుకొని సొంత ఖర్చులతో పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే మందు, విందులతో ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయంలో అవకాశాల కోసం ఎదురుచేసే వారికి వార్డు రిజర్వేషన్లు మహిళలకు రావటంతో వారి భార్యలను బరిలో దింపారు. రాజకీయంలో ఎలాంటి అనుభవం లేకపోయిన భార్తల ప్రోత్సాహంతో పోటీ చేస్తున్నారు. దీంతో వారి గెలుపు కోసం భర్తలు కంకణం కట్టుకొని దూసుకుపోతున్నారు. ప్రచారంలో వ్యూహాలు, ప్రణాళికలు, ఓటర్లను ఎలా కలవాలి, ఎలా ప్రచారం చేయాలి అని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థులుగా భార్యలు ముందు కనిపిస్తున్నా తెర వెనుక మొత్తం భర్తల పెత్తనమే నడుస్తోంది. చేవెళ్ల మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉంటే ఇందులో 9 వార్డుల్లో మహిళ రిజర్వేషన్ కింద ఉన్నాయి.
కాంగ్రెస్లో మహిళకే అవకాశం
చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ అయింది. మెజార్టీ స్థానాల్లో మహిళలకే రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో చైర్మన్ పీఠం కూడా అతివలకే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే చైర్మన్ అభ్యర్థిగా 16వ వార్డులో పోటీ చేస్తున్న దేవర సమతావెంకట్రెడ్డి పేరు మాత్రం వినిపిస్తోంది. అధిష్టానం సైతం వారికే మొగ్గు చూపిస్తుండటంతో మెజార్టీ అభ్యర్థులు గెలిస్తే మున్సిపల్ చైర్పర్సన్గా సమతావెంకట్రెడ్డికే అవకాశం రానుంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి చైర్మన్ అభ్యర్థులుగా ఇంకా ఎవరనేది తేలలేదు. కౌన్సిలర్లు మెజార్టీ సాధిస్తే అప్పుడు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది.
కాళ్లు మొక్కి..ఓట్లు అడిగి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు దండం పెట్టడం, కాళ్లు మొక్కేందుకు కూడా వెనుకాడడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఓటరు కనిపిస్తే చాలు అన్నా, అక్కా, తమ్మీ, జర ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. రాజకీయ అవకాశం కోసం అభ్యర్థులు ఓటర్ల దగ్గర రోజుకో తీరులో ప్రచారం చేస్తున్నారు. ఆదివారం సైతం ప్రధాన పార్టీల నుంచి మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
రిజర్వేషన్ల పుణ్యమా అని ‘నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అనే పాటలో మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో అతివలు బరిలో నిలిచారు. వారికి పతులు తోడుగా ఉంటూ ఓట్లు రాబట్టేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబీకులు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.
నారీ.. పతుల భేరి


