తగ్గేదేలే!
పుర పోరులో ఖర్చుకు
వెనుకాడని ప్రధాన పార్టీలు
ఇబ్రహీంపట్నం: దేనికి తగ్గేదేలేదన్నట్లుగా పుర పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ 23 స్థానాలకు, బీజేపీ 20 స్థానాల్లో బరిలో ఉంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడటంలేదు. ఈ మున్సిపాలిటీలో ఇరు పార్టీల మధ్య నువ్వానేనా అనే రీతిలో ఈ పోరు సాగుతోంది. నాలుగైదు వార్డుల్లో బీజేపీ కూడా తన సత్తా చాటేందుకు యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన తనయుడు అభిషేక్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డిలు కష్టపడుతున్నారు. మున్సిపాలిటీలో నిర్వహించిన మహిళా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ఇరుపార్టీలు ఎత్తులుజిత్తులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ప్రచార రథాలు, వాహనాలకు మైకులు పెట్టి అభ్యర్థుల ఫ్లెక్సీలు కట్టి హోరెత్తిస్తున్నారు.
డప్పు వాయిద్యాల మోత
డబ్బుతోనే ఎన్నికలు ముడిపడిపోయాయి. జనాలు వచ్చేందుకు రూ.300 నుంచి 500 వరకు ఇచ్చి జెండాలను చేత పట్టిస్తూ ప్రచారం చేయిస్తున్నారు. గల్లీగలీ, వీధివీధి డప్పు వాయిద్యాలు, సౌండ్ రికార్డులతో మార్మోగుతున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీలు డబ్బులకు వెనుకడగుకు వేయడంలేదు. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసిన మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. సాయంత్రం అయిందంటే ఆయా అభ్యర్థుల అనుచరులు, మద్దతుదారులు ఇళ్లకు మందును పంపిణీ చేస్తున్నారు. అంతేగాక మటన్, చికెన్లను కూడా ఆదివారం పంపిణీ చేయడం గమనార్హం. తిన్నోడికి తినంత.. తాగినోడికి తాగినంత అన్నట్లు ఉంది.
నేడు ప్రచారం సమాప్తం
నిత్యం తమ చుట్టూ ఉండే వాళ్లకు రోజు లెక్క ఒక పక్క డబ్బులిస్తుంటే.. గంప గుత్తుగా ఆయా సంఘాలకు ఇస్తున్నారు. రూ.వేయి నుంచి రూ.రెండు వేల వరకు పంచడం షురూవైంది. చీరలు, ఆహార వస్తువుల కిట్లు పంపిణీ, మహిళా సంఘాలతో రహస్య సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు రోజు ఓటుకు ఇంత అని చెల్లించేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం సమాప్తం కానుంది. 11న పోలింగ్, 13న ఫలితాల వెల్లడి కానుంది.
డబ్బు మయంగా మారిన వైనం
విచ్చల విడిగా
మద్యం, దావత్లు


