ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై మంగళవారం భారీ మర్రి వృక్షం రోడ్డుపై కూలింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనదారులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నేలతడిగా మారి మహావృక్షం నేల కూలింది. వృక్షం ప్రధాన రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందుగా గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఈ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఆర్అండ్ బీ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి వృక్షాన్ని రోడ్డుపై నుంచి తొలగించి వాహనాలను పునరుద్ధరించారు. భారీ వృక్షాన్ని తొలగించడానికి అధికారులకు 2 గంటల సమయం పట్టింది. అప్పటివరకు వాహనాలు ప్రధాన రహదారిపై నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు.


