తహసీల్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ గిరిజన మహిళా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ముస్తాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సేవాలాల్తండాకు చెందిన ధరంసోత్ రాజవ్వ గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. గమనించిన స్థానికులు రాజవ్వను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రాజవ్వ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజవ్వ మాట్లాడుతూ తండాలో సర్వే నంబర్లు 79, 196లలోని భూమిలో 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమిని మరొకరి పేరుపై తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారంతో ఇక్కడికొచ్చామన్నారు. దీనిని అడ్డుకోవా లని అధికారులను కోరామన్నారు. ఆ భూమి ని ఇతరులపై రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈవిషయంపై తహసీల్దార్ రామచంద్రం మాట్లాడుతూ సదరు సర్వేనంబర్లపై వచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశామని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని రాజవ్వ, ఆమె కుటుంబ సభ్యులు కోరారు.


