ఒంగోలు సబర్బన్: అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. వివిధ శాఖల్లో మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సామర్థ్యం పెంపు కోసం ప్రకాశం భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో గ్రాస్ వ్యాల్యూ ఎడిషన్ ( జీ.వీ.ఏ ) పెంపు ద్వారా జిల్లా జీడీపీ పెరిగి, తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. అందుకే క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ విధులకే పరిమితం కాకుండా, తమ పరిధిలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వివిధ రంగాల్లోని ఉత్పత్తులకు అదనపు విలువ (జీ.వీ.ఏ) జోడించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. ఈ దిశగా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకే జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ సుధాకర్ రెడ్డి, ఏ.ఎస్.ఓ.లు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, డిప్యూటీ ఎంపీడీవోలు, నియోజకవర్గస్థాయి యంగ్ ప్రొఫెషనల్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.


