మార్కాపురం రూరల్/కొండపి/యర్రగొండపాలెం: : మార్కాపురం, కొండపి మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలుల కారణంగా పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులే స్వచ్ఛందంగా శ్రమించి చెట్లను తొలగించారు. వర్షం ధాటికి తక్కువ వ్యవధిలోనే రహదారులు జలమయమయ్యాయి.
ఇంటిపై పడ్డ చెట్టు.. తప్పిన ప్రమాదం
కొండపి, పొన్నలూరు మండలాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కోయవారిపాలెం గ్రామంలో మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఓ చెట్టు ఇంటిపై పడగా, ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.యర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్లోని బీసీ కాలనీ సమీపంలో చెట్టు విరిగి తీగలపై పడటంతో దాదాపు 3గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏఈ కిషోర్ తెలిపారు.
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు


