మార్కాపురం టౌన్: మార్కాపురం లోని జవహర్ నవోదయ విద్యాలయ–2లో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతిలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, సైన్సు, గణితం సబ్జెక్టులు ఎంచుకోదలచిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులో 60 శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 25వ లోపు నవోదయ కార్యాలయం పనిచేసే సమయాల్లో అందించాలన్నారు.
● ఇద్దరు విద్యార్థులు డీబార్
ఒంగోలు టౌన్: ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం లా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, మార్కాపురంలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు గాను 760 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 725 మంది హాజరయ్యారు. 35 మంది గైర్హాజరయ్యారని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి.సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు 170 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 156 మంది పరీక్షలకు హాజరయ్యారని, మిగిలిన 14 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలకు 46 మందికి గాను 42 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి గాను పరీక్ష కేంద్రాల్లో యూనివర్శిటీ పరీశీలకులను, తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యూనివర్శిటీ తనిఖీ బృందం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు తెలిపారు.


