రాజకీయ, కుల నేతల అవతారమెత్తిన ఎస్బీ పోలీసులు
కీలక నాయకుడి సేవలో తరిస్తున్న స్పెషల్ బ్యాచ్
డిప్యూటీ మేయర్ పదవి ఇప్పిస్తానంటూ బేరసారాలు
టాస్క్ఫోర్స్ పోలీసుల పేరుతో బెట్టింగు ముఠా నుంచి పైసలు వసూలు చేసిన కోల్డ్ స్టోరేజీ నిర్వాహకుడు
పేరుకే ఖాకీ ఉద్యోగం.. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. సిఫార్సు లేఖల వ్యాపారం.. అధికార పదవులు ఇప్పిస్తామంటూ ద్వితీయశ్రేణి నేతలతో బేరసారాలు.. ఇదంతా ఒక ఎత్తయితే విచ్చలవిడి అవినీతి మరో ఎత్తు.. ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖ గాడి తప్పింది. సీఐల మొదలు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, రైటర్లు, కానిస్టేబుళ్ల వరకు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పోలీసు శాఖకు తలనొప్పిగా మారింది. వీటిపై పోలీస్బాస్ హర్షవర్దన్రాజు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
వసూళ్లలో
సాక్షి టాస్క్ఫోర్స్:
పోలీస్ శాఖకు సంబంధించి ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా పోలీసు శాఖలో అత్యంత కీలకమైన స్పెషల్ బ్రాంచి పోలీసుల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో అంతర్గత వ్యవహారాలు చూడాల్సిన స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ ఒకరు పక్కా అఽధికార పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా కీలకనేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో పదవుల వ్యవహారంలో తలదూర్చి గందరగోళం సృష్టిస్తున్నాడని ఆ పార్టీ నాయకులు కీలక నేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను ప్రతిపాదించిన అభ్యర్థికే డిప్యూటీ మేయర్ పదవి దక్కుతుందని చెప్పి కొందరు నాయకులను తన చుట్టూ తిప్పుకుంటున్నట్లు సమాచారం. అతడితో పాటు ఎస్బీలో పనిచేసి ఇటీవల రిటైరైన ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఏఎస్సైలు ఏకంగా కులనాయకులుగా కూడా అవతారమెత్తినట్లు సహచరులే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కందుకూరు, ఒంగోలు, దర్శి ఎస్బీ సిబ్బంది విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్లు క్షేత్రస్థాయి పోలీసులు చెప్పుకుంటున్నారు. కందుకూరు గంజాయి వ్యవహారంగానీ, దర్శి బెట్టింగు వ్యవహారం గురించిగానీ పత్రికల్లో వచ్చేంత వరకు ఎస్పీకి సమాచారం అందించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
రైటర్ లీలలు ఎన్నెన్నో...
ఇటీవల సస్పెండైన రైటర్పై వస్తున్న ఫిర్యాదుల చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా తన టీంను ఏర్పాటు చేసుకుని పేకాట, భూ సెటిల్మెంట్లు వంటి అనేక వ్యవహారాలు నడిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేత వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని పలువురు కానిస్టేబుళ్లకు సెక్టార్ రైటర్లుగా డీఓ వేయించినట్లు సమాచారం. ఒక కానిస్టేబుల్ను తనకు ఆర్డర్లీగా నియమించుకుని అతడిచే ఇంటి పనులు చేయించుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏఆర్లో పనిచేస్తున్న ఒక ఎస్సై, ఒక రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్, మరొక హెడ్ కానిస్టేబుల్తో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల రిటైరైన హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజూ పోలీసు స్టేషన్కు వచ్చి వ్యవహారాలలో తలదూర్చుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా నగరంలో అత్యంత వివాదాస్పదమైన కొప్పోలు, ముంగమూరు భూ వివాదాలలో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఈ సెటిల్మెంట్లలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఈ రైటర్కు పోటీగా మరో రైటర్ కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఐ వీఆర్లో ఉన్న సదరు పోలీసు స్టేషన్లో ఇన్చార్జిగా బాధ్యతలు చూస్తున్న ఎస్సైతో కుమ్మకై ్కన రైటర్.. ఆ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాసులు కురిపిస్తున్న
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు...
నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పైకి ఆ వ్యవహారం సాఫీగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.. లోపల మాత్రం భారీ ఎత్తున ముడుపుల వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. ఒంగోలు వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని కొందరు పోలీసులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబుల వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, మధ్యలోనే కొందరి వద్ద రూ.10 వేల వరకు డబ్బు తీసుకుని వదిలిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లా నుంచి రోజుకు ఎన్ని డీఎస్ఆర్లు వస్తున్నాయి.. ఎన్ని కేసులు డిస్పోజ్ అవుతున్నాయి.. ఎన్ని కేసులు నమోదు చేశారని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒక్కో పోలీసుస్టేషన్ది ఒక్కో తీరు...
ఒంగోలులో వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం టూటౌన్ సీఐ వీఆర్లో ఉన్నారు. తాలూకా పోలీసు స్టేషన్ సీఐ కూడా వీఆర్లోనే ఉన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో ఎస్సై, రైటర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక, తాలూకా సీఐ బాధితుల లిస్టు చాంతాడంత ఉందని పోలీసులే గుసగుసలాడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్లే కాకుండా చివరికి వ్యభిచారం కేసుల్లో వచ్చిన వారి నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ దామోదర్ హయాంలో ఐడీ పార్టీని రద్దు చేయడం తెలిసిందే. అయితే, తాలూకాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మాత్రం ఐడీ కానిస్టేబుల్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్టౌన్లో ఒక ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఒక ఏఎస్సై విధులు నిర్వహించకుండా కీలక నేత చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా.. నగరంలోని ఏ పోలీసు స్టేషన్లో చూసినా డ్యూటీ కంటే రాజకీయ నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత పనులు చేసుకుంటూ తిరుగుతున్న వారి వివరాలన్నీ ఎస్పీ చేతికి వచ్చినట్లు సమాచారం.
డ్రంక్ అండ్ డ్రైవ్ సొమ్ము స్వాహా
ఐడీ పార్టీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్


