● పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం..
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మినీ స్టేడియం, పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయ సమీపంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. వేలాదిగా పొగాకు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా గ్రామాల్లో ఆయన పర్యటించారు. సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, చండ్రపాలెం, తక్కెళ్లపాడు, చిలకపాడు, మద్దులూరు, చీమకుర్తి మండలంలోని పిడతలపూడి గ్రామాల్లో శనివారం పర్యటించి రైతులను కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వలన రోజురోజుకూ పొగాకు ధరలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా రైతాంగం అప్పులపాలై రోడ్డున పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి వేలం కేంద్రాల్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు క్వింటాకు రూ.30 వేలు ధరలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, జిల్లా నాయకుడు సాగర్, రైతు సంఘ నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, పొగాకు రైతులు పాల్గొన్నారు.


