● కుమార్తె దుర్మరణం
● తండ్రికి తీవ్ర గాయాలు
పొన్నలూరు: ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రాజోలుపాడు సమీపంలో ఓవీ రోడ్డుపై శనివారం జరిగింది. బాధితుల బంధువుల కథనం ప్రకారం.. దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి అశోక్రెడ్డికి మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన వెన్నపూస మాలతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి దానవితో పాటు ఏడాది బాబు ఉన్నాడు. అశోక్రెడ్డి కర్నూలులోని విత్తనాల దుకాణంలో పనిచేస్తూ రెండు రోజుల క్రితం భార్య, పిల్లలు చెన్నిపాడులో ఉండటంతో వారిని చూడటానికి వచ్చాడు. దీంతో శనివారం ఉదయం తన కుమార్తె దానవి, ఏడాది బాబుని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని టిఫిన్ కోసం కె.అగ్రహరం సెంటర్కు వెళ్లాడు. అక్కడ టిఫిన్ పార్శిల్ తీసుకుని తిరిగి చెన్నిపాడు బయల్దేరాడు. ఈ క్రమంలో రాజోలుపాడు సమీపంలోకి రాగానే కందుకూరు నుంచి నేరేడుపల్లె వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కిందపడిపోయారు. దీంతో అశోక్రెడ్డి, కుమార్తె దానవికి తీవ్ర గాయాలు కాగా ఏడాది బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం కందుకూరు తరలించారు. చిన్నారి దానవికి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దానవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


