● బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ
పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక ప్రకాశం భవనంలోని తన చాంబర్లో శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పిల్లలు ఒక భాగమని, వారిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బాల్యం అంటే చదువుకుని వృద్ధిలోకి రావడం అని, పనిచేయడం కాదని చెప్పారు. చిన్నారులు చదువుకుంటూ బడిలో ఉండాలని, పని ప్రదేశాల్లో పనిచేస్తూ కాదని అన్నారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి జీజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ కమిషనర్ గౌస్ బాషా, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, ఆహటా ఎస్సై నాగమణి, ఎన్జీవో పీ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


