వివిధ హోదాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వివిధ హోదాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకుల నియామకం

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

వివిధ హోదాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకుల నియామకం ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌గా కొండారెడ్డి భూ వివాదంతోనే దారుణ హత్య

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర లీగల్‌ సెల్‌ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన బొజ్జా సురేంద్ర చక్రవర్తిని నియమించారు. అలాగే కొండపి నియోజకవర్గ లీగల్‌ సెల్‌ కమిటీని నియమించారు. కొండపి నియోజకవర్గ లీగల్‌ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొంగల శ్రీలక్ష్మిని, కొండపి నియోజకవర్గ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీలుగా షేక్‌ రియాజ్‌ఖాన్‌, పి.వెంకటేశ్వర్లును, లీగల్‌ సెల్‌ సెక్రటరీలుగా ప్రమోద్‌, శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా అల్లాడి సునీల్‌కుమార్‌, చిమటా కోదండపాణిలను నియమించారు.

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌గా ఆర్‌ కొండారెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సిబ్బంది నియామకం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలువంటి కార్యక్రమాలు మార్కాపురం జిల్లా నుంచే జరుగుతాయన్నారు. అలాగే ఎన్‌ఎంఎంఎస్‌, ఎన్‌టీఎస్‌ఈ, ప్రతిభా పాటవ పరీక్షలు, బీఈడీ, టెట్‌ పరీక్షలను మార్కాపురం నుంచే అసిస్టెంటు కమిషనర్‌, డీఈఓ పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అనంతరం కొండారెడ్డిని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ సుబ్బారావు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

పుల్లలచెరువు: భూ వివాదం కారణంగానే మొలబంటి రవికుమార్‌ దారుణహత్యకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మొలబంటి రవికుమార్‌(52) పుల్లలచెరువు మండలంలోని శతకోడులో బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడు రవికుమార్‌ సోదరుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న వివరాల ప్రకారం.. మృతుడు రవికుమార్‌ శతకోడు గ్రామానికి చెందిన వరికూటి చిన్న పోలిరెడ్డితో కలిసి కొన్నాళ్లుగా శతకోడు ప్రాంతంలో వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు చసేఉ్తన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలతో రవికుమార్‌, పోలిరెడ్డి మధ్య వివాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న చిన్న పోలిరెడ్డి రవికుమార్‌ను బుధవారం నాడు శతకోడు గ్రామానికి పిలిపించి తన అనుచరులతో కలిసి హత్య చేసినట్లుగా మృతుని సోదరుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎస్సై సాంబశివరావు కేసు నమోదు చేశారు. సీఐ అజయ్‌ కుమార్‌ గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement