సింగరాయకొండ:
ఉప్పు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని ఉప్పు కొఠార్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప్పు తయారీ విధానాన్ని తెలుసుకొని ఉప్పుకొఠారులలో దిగి స్వయంగా ఉప్పు లాగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 1,500 ఎకరాల్లో ఉప్పు కొఠారులు ఉన్నాయని వీటిని లీజు పద్ధతిలో సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే 2027తో లీజు గడువు ముగుస్తుందని, కానీ తరువాత లీజు రెన్యువల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ భూములపై యాజమాన్య హక్కులు ఇప్పించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పు కొఠార్లకు విద్యుత్ సబ్సిడీ లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, దీంతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పండించిన పంటకు దళారుల సిండికేట్ కారణంగా గిట్టుబాటు ధర రావడం లేదని, వారు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించిన డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి ఉప్పు రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తీసుకుని వెళ్లి వారి సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పు రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, మాజీ సర్పంచ్ పివిరెడ్డి, నాటారు సుబ్బారెడ్డి, నాటారు ఆదినారాయణరెడ్డి, పుట్టా శ్రీనివాసులరెడ్డి, కావూరి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


