ఒక్కో వాహనానికి ఒక్కో ధర రవాణా శాఖ అధికారి నిర్వాకం
టంగుటూరు:
టంగుటూరు టోల్ ప్లాజా అడ్డాగా ఒక రవాణా శాఖ అధికారి అక్రమ వసూళ్లకు తెరలేపాడు. శనివారం సింగరాయకొండలో సంత కావడంతో శుక్రవారం రాత్రి 1 గంట నుంచి సంతకు తరలించడానికి ఆవులను తరలించే ఆటోలు, గొర్రెల లారీలు, వరి కోత మిషన్లు, పశువుల లారీలకు ఒంగోలు వైపు నుంచి వందల సంఖ్యలో వస్తున్నాయి. అదే అదునుగా చూసుకున్న రవాణా శాఖ అధికారి ఆవుల ఆటోల వద్ద రూ.500, గొర్రెల లారీల వద్ద రూ.2 వేలు, వరికోత మిషన్ల వద్ద రూ.500, పశువుల లారీల వద్ద రూ.2 వేలు ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఏదైనా వాహనం నిబంధనలు అతిక్రమిస్తే చలానాలు వేయాలి. కానీ వాటికి సంబంధించినవేవీ లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. అసలే టోల్ప్లాజా సర్వర్ లోపంతో వాహనాలు బారులు తీరి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా రవాణా శాఖ అధికారి వలన ట్రాఫిక్ జామై వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.


