మార్కాపురం: ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పిడుగు పడింది. అసలే నష్టాల బాటలో నడుస్తున్న ఏపీటీడీ (ఆర్టీసీ) పరిస్థితి డీజిల్ ధర పెంపుతో మరింత దయనీయంగా మారింది. రోజుకు సుమారు 1.30 లక్షల రూపాయల భారం పడుతుండగా, నెలకు సగటున 40 లక్షల రూపాయల భారం పడుతోంది. శుక్రవారం ఉదయం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. డీజిల్ లీటరుపై 3.16 రూపాయలు, పెట్రోల్ 3.14 రూపాయలు పెంచాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు, ఒంగోలు డిపోలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని బస్సులు రోజూ 2,12,124 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో డీజిల్ కూడా రోజుకు సుమారు 38,515 లీటర్లు వినియోగిస్తున్నాయి. లీటర్ ధర రూ.3.16 పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడింది.
ఇవి కాక ఆయా డిపోల్లో హైర్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి పెరిగిన డీజిల్ ఖర్చులు అదనపు భారం కానున్నాయి. లీటరు డీజిల్ సగటున 6 కిలోమీటర్లలోపే వస్తోంది. కొన్ని బస్సులకు 5 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. దీంతో నెలకు సుమారు 40 లక్షల రూపాయలు ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. ఆయిల్ కంపెనీలు మరోసారి ధరలు పెంచుతాయన్న వార్తలు వినిపిస్తుండటంతో అదనపు భారం మళ్లీ పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
డీజిల్ ధరల పెరుగుదలతో జిల్లాలో ఆర్టీసీకి నెలకు రూ.40 లక్షల అదనపు భారం
ఉమ్మడి జిల్లాలో 7 ఆర్టీసీ డిపోలు
ప్రతిరోజూ 2,11,674 కిలోమీటర్ల ప్రయాణం
మొత్తం బస్సుల సంఖ్య 527
డీజిల్ వినియోగం 38,515 లీటర్లు
డిపో బస్సుల తిరిగే డీజిల్ వాడకం
సంఖ్య కిలోమీటర్లు (లీటర్లలో)
మార్కాపురం 88 33,661 6124
పొదిలి 62 23,870 4160
కనిగిరి 89 36,768 6658
గిద్దలూరు 64 27,646 4910
అద్దంకి 39 15,557 2783
కందుకూరు 78 31,463 5540
ఒంగోలు 107 43,159 8338
మొత్తం 527 2,12,124 38,515


