మార్కాపురం రూరల్:
మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన చౌడవ కోటేశ్వరరావు (55)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి మేడూరి నాగమల్లేశ్వరరావుగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగమల్లేశ్వరరావు తన స్వగ్రామం మార్కాపురం మండలం ఎల్బీఎస్ నగర్లో ఉన్న పొలం ఆన్లైన్ పనుల కోసం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి బైకుపై నరసరావుపేట నుంచి బయల్దేరాడు. చింతగుంట్ల సమీపంలో బైపాస్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా మోటార్ సైకిల్ మలుపు తిప్పాడు. అదే సమయంలో శ్రీశైలం వైపు నుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న కారు వెనుక నుంచి వెగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న కోటేశ్వరరావుకు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగమల్లేశ్వరరావుకు స్వల్ప గాయాలుకాగా స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


