● కౌశల్ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష
ఒంగోలు సబర్బన్: కౌశల్ కార్యక్రమంలో భాగంగా గతేడాది నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు వారి అర్హత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సంబంధిత అధికారులతో శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే జాబ్మేళాలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా మొదటి విడత నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక జాబ్మేళాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఆసక్తిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న యువతకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్దిష్ట సమయాలలో పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఆయా విషయాలపై నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్త, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


