జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ముండ్లమూరు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి అండగా నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు. మండలంలోని ఈదర గ్రామంలో కొలువై ఉన్న అంకాలమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా భీమవరం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆమె మాట్లాడారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి అండగా నిలిచారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు ప్రతి విద్యార్థి ఖాతాలో నేరుగా జమ చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడ్డారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నవరత్న పథకాలతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పేదలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు, నాయకులకు బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిదేవర అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి మేకల వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు.


