ఒంగోలు టౌన్: పోలీసు కుటుంబాల చిన్నారులకు మానసిక ఉల్లాసం, వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్–2026ను మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. పరుగు పందెం, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్ క్రీడలను ప్రారంభించిన ఎస్పీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలను మాత్రమే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవన్నారు. క్రమశిక్షణ అలవడుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందని వివరించారు. నెల రోజుల క్యాంపు చిన్నారుల జీవితంలో ఒక మధురానుభూతిని మిగుల్చుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరంలో చిన్నారులకు పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రసిడెంట్, హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామి రెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, బాషా, సురేష్, తిరుపతి స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్యాంపును ప్రారంభించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు


