ఒంగోలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అల్లు సత్యానంద్ను కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో కలెక్టర్ కలుసుకున్నారు.
లింగసముద్రం: కుటుంబ కలహాలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లింగసముద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం జరిగింది. ఎస్సై రాంబాబు అందించిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇండ్ల వెంగళరావు (32) కుటుంబ కలహాలతో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు సమాచారం ఇవ్వడంతో అక్కడి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
● తప్పిన పెనుప్రమాదం
యర్రగొండపాలెం: కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఆ చెట్టు కాలిపోయింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పిందని త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వెల్లంపల్లిలోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న భారీ కొబ్బరి చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దాని తాకిడికి చెట్టు పూర్తిగా కాలిపోయింది. చెట్టుపై నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయంతో పరుగులు తీశారు. పిడుగుపాటు సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిడుగు కొబ్బరి చెట్టుపై కాకుండా ఇళ్ల మధ్యలో పడిఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు కూడా ఎటువంటి హాని జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.


