● మెగా ట్యాక్స్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్:
గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా ట్యాక్స్ మేళా’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రత్యేక రాయితీలు ఉన్నాయని తెలిపారు. మే 31వ తేదీలోపు 2026–27 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) లభిస్తుందన్నారు. జిల్లాలోని గృహ యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు పంచాయతీల ఆదాయంపైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి గ్రామ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. మే నెలాఖరు వరకు నిర్వహించే ఈ మేళాపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పన కుమారి, డీపీఓ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.


