ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఒంగోలు టౌన్: ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా సాగేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 79 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటలు దాటితే పరీక్షలకు అనుమతించరని, సరైన సమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, పరీక్షలపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతుంటాయని, చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ సెంటర్లన్నిటినీ మూసివేస్తున్నట్లు చెప్పారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మ్ గార్డులను నియమించామని, పరీక్ష కేంద్రాలకు పేపర్లు తీసుకొచ్చే సమయంలో, జవాబు పత్రాలను తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు స్మార్ట్ వాచీలు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదని, విద్యార్థులు వాటిని తీసుకొని రావద్దని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా పరీక్ష కేంద్రం వద్ద ఎటువంటి చిన్న ఘటన జరిగినా వెంటనే డయల్ 112, 100, పోలీసు వాట్సప్ నెంబర్ 91211 02266కు సమాచారం తెలపాలని ఎస్పీ కోరారు.
డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా
ఎస్పీ హర్షవర్థన్ రాజు


