పాత నిందితులపై నిఘా పెట్టాలి
ఎస్పీ హర్షవర్థన్రాజు సమీక్ష
ఒంగోలు టౌన్: జిల్లాలోని పాత ముద్దాయిలపై నిరంతరం నిఘా పెట్టాలని ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మార్కాపురం, కందుకూరు సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హత్య కేసులు, చోరీ కేసులు, పోక్సో కేసులతో పాటు పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు, ప్రార్ధనా మందిరాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తులు వేగవంతం చేయాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా చార్జిషీట్ వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో..లేదో నిరంతరం పరిశీలించాలన్నారు. గతంలో కంటే రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలని చెప్పారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు భద్రతా నిబంధనల గురించి వాహన చోదకులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ డీఎస్పీ చిరంజీవి, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


