కూతురిని చూసేందుకు వచ్చి..
● ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
కొండపి: గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురిని చూసేందుకు వచ్చి తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొండపి, పెద్దకండ్లగుంట గ్రామాల మధ్య మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన బుర్రి రామారావు(43) బెంగళూరులో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని స్వగ్రామమైన అయ్యప్పరాజుపాలెం వచ్చాడు. మంగళవారం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు కొండపి వచ్చాడు. కుమార్తెను చూసి అనంతరం వ్యక్తిగత పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళుతుండగా కొండపి, పెద్దకండ్లగుంట గ్రామాల మధ్య మూడవ కిలోమీటర్ రాయి వద్ద రైతులు నీరు కట్టుకునేందుకు వేసిన పైపులైన్లపై మట్టి ఎత్తుగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగలడంతో అటుగా వెళుతున్న వారు 108కు సమాచారం ఇచ్చి వాహనంలో కొండపి సీహెచ్సీకి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది
ప్రమాదంలో మృతి చెందిన బుర్రి రామారావుకు సంబంధించిన విలువైన వస్తువులను 108 సిబ్బంది సేకరించి మృతుడు భార్య అనురాధకు రెండు సెల్ఫోన్లను, ఉంగరం, పాపటి బిళ్లను అందజేశారు.
ఒంగోలు: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ టి.రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం మీడియేషన్ అనే అంశంపై న్యాయవాదులకు నిర్వహించిన 40 గంటల శిక్షణను న్యాయమూర్తి ప్రారంభించారు. మీడియేషన్ ద్వారా కేసు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ తిరుమలరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, మధ్యవర్తిత్వం శిక్షకులు ఎస్.పద్మ, ఎస్.అరుణాచలం పాల్గొన్నారు.
కూతురిని చూసేందుకు వచ్చి..


