ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి
● జాతీయ ఓటర్ల దినోత్సవంలో జేసీ గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: ఓటు హక్కు ప్రాధ్యానతను ప్రజలంతా గుర్తించాలని జేసీ ఆర్.గోపాలకృష్ణ కోరారు. ఆదివారం ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. జేసీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అధికారులు, విద్యార్థులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లను భాగస్వాములను చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం జరుగుతోందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం కోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేయడంతో పాటు సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఓటర్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో విశేషంగా కృషిచేసిన బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. తొలుత ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ, సంతకాల క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డీఆర్డీఎ పీడీ నారాయణ, ఉద్యానవన శాఖాధికారి గోపీచంద్, జిల్లా ఓటర్ వాచ్ అధికారి వినియోగదారుల సంఘ సభ్యులు నాగేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
ఓటు హక్కు ఎంతో పవిత్రమైంది
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: ఓటు హక్కు ఎంతో పవిత్రమైందని, ప్రజాస్వామ్యంలో పాలకులను ఓటు హక్కు ద్వారానే ఎన్నుకుంటారని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటుహక్కును వినియోగించుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులను నూతన ఓటరుగా నమోదు చేసి ప్రజా స్వామ్యంలో భాగస్వామ్యులను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఒంగోలు సబ్ డివిజన్ సీఐలు విజయకృష్ణ, శ్రీకాంత్బాబు, నాగరాజు, శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి


