రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు రథచక్రం తగిలి రాచర్ల ఎస్ఐ కాలికి గాయం
కంభం: కంభం చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదివారం సాయంత్రం 4 గంకటల సమయంలో సుమారు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి చెరువులో ఈత కొట్టేందుకు దిగి నీళ్లలో మునిగిపోయాడు. గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని గాలించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పడవుల్లో కంభం చెరువులో గాలించారు. రాత్రి 8 గంటల వరకు వెతికినా జాడ కనిపించలేదు. అయితే చెరువులోకి దిగిన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు.
పొన్నలూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పొన్నలూరు, విప్పగుంట మార్గ మధ్యలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..వలేటివారిపాలెం మండలం చుండి గ్రామానికి చెందిన ఆదాల గోవిందు వ్యక్తిగత పని మీద తన ద్విచక్ర వాహనంపై పొన్నలూరు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కొంత దూరం వెళ్లిన తరువాత ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో కిందపడిన గోవిందుకు తల, శరీరంపై గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స కోసం గోవిందుని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఆదివారం సాయంత్రం రథసప్తమి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవానికి బందోబస్తు కోసం వచ్చిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవంలో తన సిబ్బందితో భక్తులను అదుపు చేసే క్రమంలో పొరపాటున రథచక్రం రాచర్ల ఎస్సై కాలిని తగిలింది. గాయమైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఒంగోలుకు తీసుకువెళ్లారు.


