దేవుడి భూమి దోచేద్దాం
ఎమ్మెల్యే బొమ్మెడదాం
పామూరు:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దరిమిలా టీడీపీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోరంబోకు భూములను ఎక్కడికక్కడ చదును చేసి తమ అనుభవంలో ఉంచుకుంటున్న కొందరు టీడీపీ నాయకులు.. ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములపైనా కన్నేశారు. పామూరులోని నెల్లూరు రోడ్డులో సర్వే నంబర్ 439/5లోని 1.97 ఎకరాల దేవదాయ శాఖ భూమిని టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమించి ఫెన్సింగ్ వేశాడు. అంతటితో ఆగకుండా తన జోలికి ఎవరూ రాకూడదని హెచ్చరికగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఫొటోను ట్రంప్ కార్డ్లా వాడటం చర్చనీయాంశమైంది. ఆక్రమిత భూమిని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్న దేవదాయ శాఖ ఈఓ నరసింహబాబు, వీఆర్ఓ సరస్వతి, ఇతర సిబ్బంది.. ఫెన్సింగ్ రాయిపై ఎమ్మెల్యే ఉగ్ర ఫొటోను చూసి అవాక్కయ్యారు. కాగా దేవదాయశాఖ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుతీసుకుంటామని ఈఓ హెచ్చరించారు. ఆక్రమణ తొలగింపులో రాజీ పడేది లేదని, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ఈ ఆక్రమణ దందాకు ఎమ్మెల్యే ఫోటోను వినియోగించడం పామూరు మండలంలో హాట్ టాపిక్గా మారింది.
ఆక్రమిత భూమిలో ఫెన్సింగ్ రాయిపై ఎమ్మెల్యే ‘ఉగ్ర’ ఫొటో ఏర్పాటు
పామూరు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన భూదందా
ఎండోమెంట్ భూములను పరిశీలించిన ఆర్డీఓ కేశవర్థన్రెడ్డి


