సరుగుడు తోట ధ్వంసం
కందుకూరు రూరల్: సరుగుడు తోటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన కందుకూరు మండలంలోని పాలూరు గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పాలూరు గ్రామానికి చెందిన సూరే రాధమ్మకు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల పక్కనే మూడు ఎకరాల భూమి ఉంది. అందులో రెండేళ్ల క్రితం సరుగుడు మొక్కలు సాగు చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పొలం కంచెకు ఉన్న గేటును ట్రాక్టర్తో ఢీకొట్టి లోపలికి ప్రవేశించారు. రోటావేటర్తో సరుగుడు మొక్కలను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పొలానికి చేరుకున్న రాధమ్మ ధ్వంసమైన మొక్కలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు.
ఆస్తి గొడవలే కారణం?
సూరే రాధమ్మ, ఆమె బంధువుల మధ్య కొంత కాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సరుగుడు తోటను ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఆమె బంధువు టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అధికార బలంతో సరుగుడు మొక్కలు ధ్వంసం చేయించి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వివాదముంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ తోటలను ధ్వంసం చేయడం సరికాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు తమ గ్రామంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రాధమ్మ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకారెడ్డి కౌలుకు తీసుకొని సరుగుడు తోట సాగు చేశాడు. వచ్చే ఆదాయాన్ని ఇద్దరు సమానంగా తీసుకుంటారు. టీడీపీ నేత దుశ్చర్యతో కౌలు రైతు నష్టపోయే పరిస్థితి వచ్చిందని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
రాత్రికి రాత్రే రోటావీటర్తో దున్నేసిన గుర్తు తెలియని దుండగులు
కందుకూరు మండలం పాలూరులో ఘటన
సరుగుడు తోట ధ్వంసం


