రోడ్డు ప్రమాదాలు నివారించాలి
ఒంగోలు సబర్బన్: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా వాటిని నియంత్రించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన స్థానిక ప్రకాశం భవనంలో రహదారి భద్రతపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి దారి తీసిన పరిస్థితులు, నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వి.హర్షవర్థన్రాజుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 22 ప్రాంతాలను గుర్తించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రహదారి భద్రతకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలరోజులపాటు ప్రత్యేక విజిలెన్స్ ఉండాలన్నారు. స్పీడ్ గన్స్ ద్వారా వాహనాల వేగాన్ని గమనించి పరిమితికి మించిన స్పీడుతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధించాలన్నారు. జిల్లాలో రోడ్డు భద్రతకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అవసరమైన సత్వర వైద్య సహాయంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఐరాడ్ యాప్ను సమర్థంగా వినియోగించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్పై దృష్టి సారించాలన్నారు. జాతీయ రహదారుల్లో సర్వీస్ రోడ్లు కలుస్తున్న చోట ప్రమాదాల నివారణకు మిర్రర్లు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు బాధ్యతగా పనిచేస్తామంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో డీటీసీ సుశీల, మార్కాపురం ఆర్టీవో శ్రీచందన, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవినాయక్, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ శ్రీనివాసనాయక్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రహదారి భద్రత జిల్లా కమిటీ
సమావేశంలో కలెక్టర్ రాజాబాబు


