చీకట్లో చిన్నారుట్ల
పెద్దదోర్నాల:
నల్లమల అభయారణ్యంలో చీకట్లో మగ్గుతున్న గిరిజన గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి ప్రభుత్వం సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది. సోలార్ యూనిట్లు కొంత కాలం వరకు బాగానే పనిచేశాయి. నిర్వహణ లోపంతో సకాలంలో మరమ్మతులు చేపట్టక పోవడతో చిన్నిరుట్ల గిరిజన గూడెంలోని సోలార్ యూనిట్లు కొన్నాళ్లకే మూలకు చేరాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నారుట్ల, పెద్దచేమ గూడేల్లో సుమారు 60 కుటుంబాలకు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ను కల్పించారు. ఒక్కో కుటుంబానికి సోలార్ ప్యానల్ బ్యాటరీతో పాటు ఇన్వర్టర్లు అందజేశారు. దీంతో పాటు చిన్నారుట్ల గిరిజన గూడెంలో వీధి లైట్ల కోసం గూడెంలో ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు.కొన్నాళ్ల పాటు సేవలందించిన ఆ యూనిట్ నిర్వహణ లేక పోవడంతో మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. సోలార్ విద్యుత్ ప్లాంట్లు మూలన పడటంతో వీధి లైట్లు లేక గూడేనికి చెందిన చెంచు గిరిజనులు రాత్రి వేళలో చిమ్మచీకట్లోనే గడుపుతున్నారు. గూడెం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఎప్పుడు ఏ క్రూరమృగం వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో పాటు వర్షాకాల సమయాల్లో విష పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వెలుతురు లేక పోవడంతో గూడెంలోకి ఏ వన్యప్రాణి వచ్చిందో తెలియక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారి
కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల మూడేళ్ల చిన్నారి గతేడాది ఆగస్టు 13వ తేదీ అర్ధరాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గూడెంలోకి ప్రవేశించిన చిరుతపులి చిన్నారిని నోట కరుచుకుని పరుగులు తీసింది. ఇది గమనించిన గూడెం వాసులు కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసింది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. దీంతో పాటు గూడెంలోని పలు పశువులు, మేకలపై చిరుతలు, పెద్దపులులు దాడులు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చిన్నారిపై దాడి సంఘటనపై ఆగ్రహించిన గూడెం వాసులు రోడ్డుపై బైఠాయించి గూడేనికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాస్తారోకో సైతం అప్పట్లో చేశారు.
సోలార్ ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టాలి:
చిన్నారుట్ల గిరిజన గూడెంలో సోలార్ ప్లాంట్లు పనిచేయక రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికులం తీవ్ర అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం అందజేసిన సోలార్ ప్లాంట్లతో వీధి దీపాలు కొన్నాళ్ల పాటు సక్రమంగానే పని చేశాయి. అ తర్వాత పనిచేయక మూలకు చేరాయి. బ్యాటరీలు, ప్యానల్ బోర్డులు పనిచేయక పోవడంతో గూడెంలో వీధిలైట్లు వెలగటం లేదు. వెలుతురు కోసం రాత్రిళ్లు మంటలు వేసుకుంటున్నాం. గతంలో వ్యన్యప్రాణులు పశువులపై దాడులు చేసి వాటిని పొట్టన పెట్టుకున్నాయి. చిరుతపులి దాడిలో గూడేనికి చెందిన ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అధికారులు స్పందించి సోలార్ ప్యానల్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
వెంకటేఽశం, గిరిజన యువకుడు, చిన్నారుట్ల
చీకట్లో చిన్నారుట్ల
చీకట్లో చిన్నారుట్ల


