నీరు తరలింపుపై రైతుల ఆగ్రహం
గుడ్లూరు: మండలంలోని చేవూరు చెరువు నుంచి ఇండోసోల్ కంపెనీ అనుమతులు లేకుండా నీరు తరలించేందుకు ప్రయత్నించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నుంచి నీరు తరలించేందుకు కంపెనీ ప్రతినిధులు చెరువు కట్టకు రంధ్రం చేసి తూములు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు నీరు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రైతులు కంపెనీ ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ చెరువు ఆయకట్టు కింద వరి సాగులో ఉందని, కొంత మంది రైతులకు ఇంత వరకు పరిహారం కూడా చెల్లించలేదన్నారు. చెరువులో మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో చేపలు సైతం ఉన్నాయని తెలిపారు. చెరువులో నీటిని వాడుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వాదనకు దిగగా, చెరువు నీటి విషయంలో స్టే ఉందని రైతులు చెప్పారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా..చెరువు నీరు వాడుకోవడానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
చెరువు నీరు తరలించడంపై మండిపాటు
నీరు తరలింపుపై రైతుల ఆగ్రహం


