ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఒంగోలులో బాలోత్సవం
ఒంగోలు టౌన్: స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగాణంలో ప్రకాశం బాలోత్సవం తృతీయ పిల్లల పండుగను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక ఎల్బీజీ భవనంలో బాలోత్సవం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా బాలోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమరావతి బాలోత్సవం రాష్ట్ర కార్యదర్శి యూవీ రామరాజు మాట్లాడుతూ మితిమీరి సెల్ఫోన్ల వాడకం, ఇతర దురవాట్ల నుంచి చిన్నారులను కాపాడాలన్న సదుద్దేశంతో బాలోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశీలన, ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించేందుకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. ప్రకాశం బాలోత్సం వర్కింగ్ ప్రెసిడెంట్ డి.వీరాంజనేయులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో దేశభక్తి భావాలు, సామాజిక స్పృహ, మానవ విలువలు, శాసీ్త్రయ దృక్పథం పెంపొదింపజేయడం, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవం ఉపయుక్తం అవుతుందన్నారు. బాలోత్సవం కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్, మట్టితో బొమ్మలు చేయడం, డ్రాయింగ్, ఏకపాత్రాభినయం, శాసీ్త్రయ నృత్యాలు, అభ్యుదయ గేయాలు, ఫ్యాన్సీ డ్రెస్ వంటి 42 అకడమిక్, నాన్ అకడమిక్ అంశాలతో ఈవెంట్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో జూనియర్, సీనియర్ విభాగాల విద్యార్థులకు వేరువేరుగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఫిబ్రవరి 2వ తేదీలోగా గూగుల్ ఫాంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ హై, వై.వెంకటరావు, జి.ఉమామహేశ్వరి, ఎన్.నిన్నస్మా, నల్లూరి వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, యు.భాస్కర్ నాయుడు, మాల్యాద్రి, పి.సుబ్రహ్మణ్యం, షేక్ ఖాజా హుసేన్, దామా శ్రీనివాసులు, ఎల్.శ్రీనివాసరావు, వి.బాలకోటయ్య, సీహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.


