జెండా పాతిన జీపీఎం.. మిజోరంలో సంచలన విజయం | ZPM Will Win In Mizoram Over MNF Five Things To Know The Alliance | Sakshi
Sakshi News home page

జెండా పాతిన జీపీఎం.. సంచలన విజయం.. ఎంఎన్‌ఎఫ్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌కు షాక్‌

Dec 4 2023 1:36 PM | Updated on Dec 4 2023 4:21 PM

ZPM Will Win In Mizoram Over MNF Five Things To Know The Alliance - Sakshi

ఈశాన్య రాష్ట్రం అసెంబ్లీ ఫలితాల్లో సంచలన విజయం నమోదు అయ్యింది.  

అగర్తలా: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం విజయం నమోదు అయ్యింది. ప్రాంతీయ పార్టీ జీపీఎం(ZPM) 27 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది జీపీఎం. ఎంఎన్‌ఎఫ్‌ 10 స్థానాల్లో నెగ్గగా.. బీజేపీ 2, కాంగ్రెస్‌ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. 

మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 21 కాగా, మిజోరం మరో ఆరు ఎక్కువ సీట్లకే కైవసం చేసుకుంది. 

మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

ఈ కూటమికి సంబంధించిన 5 ముఖ్యమైన విషయాలు..
► రాష్ట్రంలోని జోరం పీపుల్స్ మూవ్‌మెంట్‌(జీపీఎం) ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ. ఈ పార్టీలన్నీ జెడ్‌పీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. 

► జీపీఎం స్థాపించిన కొద్ది ఏళ్లలోనే మిజోరంలో గణనీయంగా దీని ప్రాధాన్యతను సంపాధించుకుంది. ఈ పార్టీని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. 

► మాజీ ఎంపీ, ఎమ్మెల్యే లల్దుహోమ జీపీఎం పార్టీని స్థాపించారు. ఆయనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు.   

► మిజోరంలో లౌకికవాదాన్ని విస్తరించటం, ప్రాంతీయ మైనారిటీలకు రక్షణ కల్పించడం ఈ పార్టీ అవలభించే ప్రాధాన్యతలుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ముఖ్యగా ప్రస్తుత సీఎం జోరమ్‌తంగాపై అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యింది. 

► మిజోరంలో జీపీఎం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ కూటమి ప్రాధాన్యతలలో ఒకటిగా ప్రచారం చేసింది.

ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్‌) 26 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ 3 స్థానాల నుంచి ఒకటికి పడిపోగా, బీజేపీ 2 నియోజకవర్గాల్లో నెగ్గి.. గత ఎన్నికల కంటే ఒక స్థానం అదనంగా దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement