నెల్లూరు క్లీన్‌ స్వీప్‌ | YSR Congress Party clean sweep in Nellore Corporation Elections | Sakshi
Sakshi News home page

నెల్లూరు క్లీన్‌ స్వీప్‌

Nov 18 2021 3:03 AM | Updated on Nov 18 2021 7:10 AM

YSR Congress Party clean sweep in Nellore Corporation Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 54 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐల ఉనికే కనిపించలేదు. ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా..  ఎక్కడైనా.. వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోమారు రుజువైంది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలు 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కౌన్సిలర్లుగా పట్టం కట్టారు. సీఎం జగన్‌ రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న పాలన, మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కష్టానికి తగ్గ ఫలితంగా మునిసిపల్‌ ఫలితాలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. 

రాష్ట్ర నేతలకు చేదు అనుభవం
టీడీపీ జాతీయ, రాష్ట్ర నేతలుగా చలామణి అవుతున్న వారందరికి మునిసిపల్‌ పోరులో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నివాసం ఉంటున్న 20వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు, కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంత డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. సోమిరెడ్డి స్వగ్రామం అల్లీపురం 2వ డివిజన్‌ పరిధిలో ఉంది. ఈ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మేకల రామ్మూర్తి విజయం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు ఇంటింటా ప్రచారం చేశారు.

టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని తీరాలనే దిశగా అనేక ప్రలోభాలకు గురిచేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా అక్కడ సోమిరెడ్డి వర్సెస్‌ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అన్నట్లుగా ఎన్నికలు సాగాయి. ఇద్దరూ తమ అభ్యర్థులు గెలిపించుకోవాలని పోటాపోటీగా ప్రచారం చేశారు. 889 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామ్మోహన్‌ విజయం సాధించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం ఉంటున్న 12వ డివిజన్‌ (చింతారెడ్డిపాళెం) వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ నివాసం ఉంటున్న 18వ డివిజన్‌లోను, పార్టీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసం ఉన్న 16వ డివిజన్‌లోను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement