నాకు, నా కార్యకర్తలకు ఏం జరిగినా కేసీఆర్‌దే పూర్తి బాధ్యత: వైఎస్‌ షర్మిల

YS Sharmila Meets Governor Tamilisai At Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను షర్మిల కలిశారు. ఈ మేరకు పోలీసుల వైఖరిపై గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడారు.

ఏ కారణం లేకుండానే తమపై పోలీసులు దాడి చేశారని షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. కావాలానే శాంతి భద్రతల సమస్య సృష్టించారని విమర్శించారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వివరించినట్లు తెలిపారు.

ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదని షర్మిల ధ్వజమెత్తారు. ఓ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని దుయ్యబట్టారు. కాగా 2 రోజులుగా టీఆర్‌ఎస్‌ వర్గాల దాడుల నేపథ్యంలో షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
చదవండి: నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

‘మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కేటీఆర్‌, కవిత ఇళ్లలో సోదాలు చేయాలి. లక్షల కోట్ల రూపాయలు బయటపడతాయి. లిక్కర్‌ స్కాంలో కవిత పేరు ఉంది. డబ్బు సంపాదించడం తప్పా టీఆర్‌ఎస్‌ నేతలు చేసిందేంటి? అవినీతి, భూకబ్జాలు ప్రశ్నించడం రెచ్చగొట్టడం అవుతుందా? ఉద్యమకారులను తరిమేసి.. పార్టీలో తాలిబన్‌లను చేర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు వందల కోట్లు ఎలా సంపాదించారు? కేసీఆర్‌ కుటుంబానికి వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది. నన్ను బీజేపీ కోవర్టు అని నిందిస్తారా.. ఇక్కడి అవినీతిపై సీబీఐకి లేఖ రాస్తా..

రేపటి నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగిస్తా. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ నేతలు మాపై బెదిరింపులకు దిగుతున్నారు. పాదయాత్రలో చేస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాకేమైనా జరిగినా, నా కార్యకర్తలకు ఏమైనా జరిగినా కేసీఆర్‌దే పూర్తి బాధ్యత. ఆడపిల్ల పుట్టగానే ఆడ.. పిల్ల అంటారు. నా గతం ఇక్కడే.. భవిష్యత్తు ఇక్కడే. నేను ఇక్కడ పెరిగాను. ఇక్కడే చదువుకున్నా. ఇక్కడే పెళ్లి చేసుకున్నా. కేసీఆర్‌ బూతు పురాణం వల్లించారంటూ వీడియో క్లిప్‌ ప్రదర్శన. కేసీఆర్‌ భార్య ఎక్కడి నుంచి వచ్చారు. ఆమె ఏపీకి చెందిన వ్యక్తి కాదా. ఆమెను గౌరవించడం లేదా’ అని షర్మిల ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top