సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.
‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి
..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.


