గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి సూచనల మేరకు సోమవారం వన్ కే వాక్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది కేసుల సత్వర పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా కేసులను సులభ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొ న్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి ఈ వన్ కే వాక్ నిర్వహించినట్లు తెలిపారు. వన్ కే వాక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నుంచి మెడికల్ కాలేజీ రోడ్డు, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సంస్థ కార్యాలయం వరకు సాగింది. మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వలంటీర్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్ధానంలో సహస్ర ఘటాభిషేకాన్ని సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు అర్చక స్వాములు జరిపారు. గణపతి పూజ, వరుణ జప సంకల్పం, నవగ్రహ మండపారాధన అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఘటాభిషేకం మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. గర్భాలయంలోని మూలవిరాట్ పూర్తిగా నీటమునిగే వరకు ఘటాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి నారాయణ
గుంటూరు వెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలే పరమావధిగా వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సీఆర్డిఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులతో కలిసి తాడికొండ, మోతడక, కంతేరు గ్రామ రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. తాడికొండ, మోతడక గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్కు ముందుకు వచ్చారని, కంతేరు గ్రామ రైతులతో మరోసారి మాట్లాడి తెలియజేస్తామని అన్నారని వివరించారు. రైతులు కోరిన విధంగా ల్యాండ్ ఫూలింగ్కు కాలవ్యవధి నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో మూడు గ్రామాల రైతులతోపాటు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్వో ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.17 లక్షల విలువైన లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. దొండేటి ఐశ్వర్య జ్యోతి, కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసి సుమారు 108 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కాసుల హారాన్ని అందజేశారు.


