డ్రగ్స్‌ డబ్బుతో కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది: మోదీ | Uses money to win elections: PM jabs Congress over Delhi drug bust | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ డబ్బుతో కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది: మోదీ

Oct 5 2024 3:49 PM | Updated on Oct 5 2024 4:14 PM

Uses money to win elections: PM jabs Congress over Delhi drug bust

ముంబై:ఇటీవల ఢిల్లీలో పట్టుబడ్డ రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్‌ కేసు రాజకీయ మలుపు తిరుగుతోంది. డ్రగ్స్‌వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతగా ఆరోపిస్తున్న తుషార్‌ గోయల్‌ అరెస్ట్‌ కావడమే అందుకు ప్రధాన కారణంగా మారింది. దీంతో డ్రగ్స్‌ కేసు కాస్తా బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ పొలిటికల్‌ ఫైట్‌గా మారింది. తాజాగా ఈ కేసును ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు.

దేశంలోని యువతను కాంగ్రెస్‌.. మాదక ద్రవ్యాల వాడకం వైపు నెట్టేస్తోందని మండిపడ్డారు. దీని ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించాలని పార్టీ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. ఈ డ్రగ్స్‌ రాకెట్‌లో ప్రధాన నిందితుడు కాంగ్రెస్‌ నేత. యువతను డ్రగ్స్‌ వైపు నెట్టాలని, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది’ అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని ఆయన కోరారు. ‘మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోంది. భారతదేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటోందో ప్రజలు అందరూ చూడగలరు* అని ఆయన పేర్కొన్నారు.

కాగా అక్టోబర్ 2న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని ఒక గోడౌన్‌లో ఢిల్లీ పోలీసులు దాడులు చేసి 560 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 5,620 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్‌తో సంబంధాలున్న తుషార్ గోయల్‌ను గుర్తించారు. అయితే గోయల్‌తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించగా.. అతను గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌కు ఆర్‌టీఐ సెల్ ఛైర్మన్‌గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తేలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement