బహిరంగ చర్చకు రండి.. చార్జిషీట్‌ సంగతి తేలుస్తాం | TPCC chief Mahesh Goud fires on BRS and BJP: Telangana | Sakshi
Sakshi News home page

బహిరంగ చర్చకు రండి.. చార్జిషీట్‌ సంగతి తేలుస్తాం

Dec 2 2024 6:05 AM | Updated on Dec 2 2024 6:05 AM

TPCC chief Mahesh Goud fires on BRS and BJP: Telangana

మీ పదేళ్ల పాలన.. మా ఏడాది పాలనపై చర్చించేందుకు వస్తారా?

బీఆర్‌ఎస్, బీజేపీలు కవల పిల్లలని మరోమారు రుజువైంది: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఫైర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఏడాది పాలనపై చార్జిషీట్‌ అంటూ బీజేపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనపై ఆ పార్టీ నేతలు తమతో బహిరంగ చర్చకు వస్తే చార్జిషీట్‌ సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. తమతో చర్చకు వచ్చే సత్తా బీజేపీ నేతలకు ఉందా అని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో తెలంగాణలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాము చర్చకు రెడీగా ఉన్నామని చెప్పారు.

ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని, వంద రోజుల్లో అన్ని ధరలు తగ్గిస్తామని, డాలర్‌కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, రూ.50కే లీటర్‌ పెట్రోల్‌ ఇస్తామని చెప్పిన బీజేపీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూల్చా రని, దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను చేర్చు కున్న బీజేపీ నేతలు తమకు సుద్దులు చెబుతారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగ తీవ్రత ఉందని గుర్తు చేశారు.

2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను తీసుకొని ఆ పార్టీ నేతలు వస్తే, తమ 2023 ఎన్నికల మేనిఫెస్టోను తీసుకొని తాము వస్తామని, ఏడాదిలో ఏం చేశామో తాము చెబుతామని, పదేళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని మరోమారు రుజు వైందని, సమయం వచ్చినప్పుడల్లా ఆ పార్టీలు ఏ టీం, బీ టీంలా వ్యవహరి స్తాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నందుకే తెలంగాణలో బీజేపీ అడుగంటిపోతోందని, ఇప్పుడు చార్జిషీట్‌ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు కవల పిల్లల్లాంటివని ఈ చార్జిషీట్‌తో రుజువైందన్నారు. ఏడాదిగా తాము చేస్తున్న కార్యక్రమాలేవీ బీజేపీ నేతలకు కనపడడం లేదా అని మహేశ్‌గౌడ్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement