‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్‌ టీవీ | sansad tv responds Supriya Sule accuses censoring non Hindi speeches | Sakshi
Sakshi News home page

‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్‌ టీవీ

Jul 23 2024 11:35 AM | Updated on Jul 23 2024 11:38 AM

sansad tv responds Supriya Sule accuses censoring non Hindi speeches

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్‌ పవార్‌) ఎంపీ సుప్రియా సూలే సోమవారం  ఆరోపణలు చేశారు.  ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్‌ టీవీ స్పందించింది.

‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్‌ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం  హిందీ, ఇంగ్లీష్‌, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్‌ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్  కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్‌’లో పేర్కొంది.

సోమవారం పార్లమెంట్‌ సమావేశాల ప్రరంభం అయ్యాయి.  ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్‌ టీవీ  హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపణలు చేశారు.

‘పార్లమెంట్‌ సమావేశాల్లో  లోక్‌సభ తొలి సెషన్‌లోనే సంసంద్‌ టీవీ ఇంగ్లీష్‌,  ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్‌ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్‌ టీవీ పాల్పడుతోంది. సంసద్‌ టీవీ హిందీలో  ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్‌ చేయటమే.

..ప్రాంతీయ, ఇంగ్లీష్‌ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వటం, సెన్సార్‌షిప్‌ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని  ఆరోపణలు చేశారు.

2023లో కూడా సంసద్‌ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విమర్శలు గుప్పించారు.  ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్‌ టైంను సంసద్‌ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement