లోకేష్‌కు ఆ విషయం కూడా తెలియదా?: సజ్జల | Sakshi
Sakshi News home page

అత్యాశకు పోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం 

Published Sun, Sep 13 2020 5:40 PM

Sajjala Ramakrishna Reddy takes on Chandrababu, Nara Lokesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘సుదీర్ఘ కాలం అధికారంలో ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. నేచురల్‌ గ్యాస్‌పై వ్యాట్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలపైన కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నారా లోకేష్‌ ఎంత చదువుకుని ఏమి ఉపయోగం. వ్యాట్‌ పెంచుతూ ఇచ్చిన జీవో కూడా చదవకుండా లోకేష్‌ ట్విట్‌ చేస్తారా? సీఎన్జీ, ఎల్పీజీకి కూడా లోకేష్‌కు తేడా తెలియడం లేదా? అత్యాశకు పోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. లోకేష్‌కు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాదు. ఎల్పీజీ కేంద్రం పరిధిలోని అంశమని కూడా లోకేష్‌కు తెలియదు. ఇచ్చిన ప్రతి మాటకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారు. చెప్పినవే కాకుండా చెప్పవని కూడా ముఖ్యమంత్రి‌ చేస్తున్నారు. పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేస్తున్నాం. 

చంద్రబాబు కుల, మత రాజకీయాలు చేస్తున్నారు. ఆయన జీవితమంతా కుళ్లు, కుట్రలు, కుతంత్రాలే. కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్‌లు ఏమైపోయారు?.సలహాలు ఇవ్వల్సింది పోయి.. పక్కరాష్ట్రంలో దాక్కున్నారు. చంద్రబాబు రాజధాని కోసం వసూలు చేసిన చందాలు ఏమయ్యాయి? బలవంతపు భూసేకరణ చేసి చంద్రబాబు రైతులను మోసం చేశారు.రాష్ట్రంలో సీఎన్జీపై 20కోట్ల టర్నోవర్‌ మాత్రమే ఉంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాట్‌ పెంచాల్సి వచ్చింది. ఆర్థికంగా పేదలను ఆదుకోవాలని చర్యలు తీసుకుంటున్నాం. 

మతాన్ని అడ్డం పెట్టుకోని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. గ్రామాల్లో జరిగిన ఘటనలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లటమే ఎజెండాగా పెట్టుకున్నారు. మీడియా మేనేజ్‌మెంట్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అంతర్వేది ఘటనపై మాత్రమే సీబీఐ విచారణకు ఇచ్చాం.’ అని తెలిపారు.

Advertisement
Advertisement