Sajjala Ramakrishna Reddy Slams Chandrababu In Nai Brahmana Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

నాయీబ్రాహ్మణులు కాలర్‌ ఎగిరేసి బతికేలా సీఎం జగన్‌ చేశారు: సజ్జల

Apr 25 2023 2:27 PM | Updated on Apr 25 2023 3:22 PM

sajjala Ramakrishna Reddy Slams Chandrababu Nai Brahmana Meeting - Sakshi

తాడేపల్లి: బీసీలకు నిజమైన న్యాయం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉండాలో చేసి చూపించిన వ్యక్తి జగన్‌ అని కొనియాడారు. తాడేపల్లిలోని నాయీబ్రహ్మణ కృతజ్ఞతా సభలో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో జరిగిందంతా నీచ రాజకీయమేనని ధ్వజమెత్తారు. మీడియాని అడ్డం పెట్టుకుని కావాల్సిన రీతిలో వార్తలు రాయించుకునేతత్వం చంద్రబాబుదని మండిపడ్డారు.

నాయీ బ్రహ్మణులకు చట్ట సభల్లో అవకాశం
నాయీ బ్రాహ్మణులు కాలర్‌ ఎగిరేసి బతికేలా సీఎం జగన్‌ చేశారని సజ్జల పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి నాయీ బ్రాహ్మణులు అండగా నిలవాలని సూచించారు. నాయీ బ్రాహ్మణులకు ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారని, చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. త్వరలో ఎమ్మెల్సీ కూడా వచ్చి తీరుతుందన్నారు. టీడీపీ ప్రచార ఆర్భాటాలలో పడిపోకుండా వాస్తవాలేంటో గ్రహించాలని తెలిపారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాకే ఈ పథకాలు అందుబాటులోకి
‘దివంగత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను తెచ్చి అందరికీ న్యాయం చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్ళీ వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చాకనే ఆ పథకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. చంద్రబాబు తాను చదువుకున్న స్కూల్‌నే పట్టించుకోలేదు. జగన్ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూల్స్‌ను బాగు చేయించారు. ఎల్‌కేజీ నుంచి విదేశాల్లో చదువుకునే వరకు మన పిల్లలకు అన్నీ అవకాశాలు కల్పిస్తున్నారు.

బాబు ప్రభుత్వంలో అన్ని అవినీతి, అక్రమాలే
ఏనాడూ చంద్రబాబు సొంతంగా అధికారంలోకి రాలేదు. 2014-19 మధ్య అవకాశం వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేదు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు అంతటా అవినీతి, అక్రమాలే. టిడ్కో ఇళ్లు కట్టించలేక పునాదుల దశలోనే వదిలేశారు. జగన్ వచ్చాకే వాటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నారు. మనం కట్టించిన ఇళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకుని మనకే సవాల్ చేస్తున్నారు. వీటిని ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేసుకుంటోంది. లోకేష్‌కు ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేమీ నేర్పలేదేమో?. నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు మీడియా బలం తప్ప మరేమీలేదు. 

వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు
చంద్రబాబు చీకటికి ప్రతినిధి, జగన్ వెలుగులకు ప్రతినిధి. చంద్రబాబు ఒక దోపిడీ మందను తయారు చేసుకున్నారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పటం ఆయనకే సాధ్యం. నిజాలు చెప్తే చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందని వైఎస్సార్‌ అంటూ ఉండేవారు. అది నిజమే అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుంది. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. నా వల్ల మేలు జరిగితేనే ఓటెయ్యమని అడిగే ధైర్యం జగన్‌ది. 

కుల వృత్తులకు అండగా సీఎం జగన్‌ ప్రభుత్వం
బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇవ్వగలిగాం. నిజమైన అర్హత బీసీలకు కూడా ఉన్నందునే జగన్ అన్ని పదవులు ఇవ్వగలిగారు. జగన్ ఓట్ల కోసం చేయటం లేదు. అందరి ఆత్మగౌరవం పెరగాలని చూస్తారు. కులవృత్తులకు అండగా నిలవటం ప్రభుత్వం బాధ్యతగా చూస్తుంది. చేదోడు పథకం ద్వారా పదివేలు చొప్పున మూడేళ్లుగా అందిస్తున్నాం. 

పోటీతత్వం పెరుగుతున్నందున మనం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. వంచనతోనే గెలవాలనుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన పార్టీని వచ్చే ఎన్నికలలో భూస్థాపితం చేయాలి. లేకపోతే సామాన్యులు బతకలేరు. గత ఎన్నికలలోనే గట్టిగా దెబ్బ కొట్టినా మళ్ళీ వస్తున్నాడు. ఈసారి రాజకీయంగా అంతం చేయాలి. 175కి 175 సీట్లు కొట్టటమే‌ లక్ష్యంగా పని చేయాలి.’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement