అవసాన దశలో టీడీపీ: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ ఉన్న టీడీపీ వేరు.. ఇప్పటి టీడీపీ వేరని.. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీది  40 ఏళ్ల సంబరాలు కాదని.. 27 ఏళ్ల సంబరమేనంటూ ఎద్దేవా చేశారు.

చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్‌..

‘‘వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఆయనకు మీడియా మేనేజ్‌మెంట్‌ బాగా తెలుసు. ఎన్టీఆర్‌ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్‌తో అధికారంలోకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుది. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉంది. అసెంబ్లీ జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ యత్నించింది. టీడీపీకి బాకా ఊదడమే ఎల్లో మీడియా పని’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

‘‘ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు ఒక కోటరీతో కుట్ర చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ప్రయాణం కీలకంగా పరిశీలించాల్సిన అంశం. ప్రజా బలంతో ఎన్టీఆర్ ఎదిగితే.. కుట్రలతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆ రోజు చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు హయాంలో 27 ఏళ్ల టీడీపీ చరిత్రపై పరిశోధనలు జరగాలి. పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన వైఎస్సార్, జగన్‌ల ముందు చంద్రబాబు ఎత్తుగడలు సాగలేదు. అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై మాట్లాడటానికి టీడీపీ ఎందుకు ఉపయోగించుకోలేదు. వాళ్లు కావాలని అసెంబ్లీ సమయాన్ని వృథా చేయాలని భావించారు. జగన్ పై అడ్డంగా బండలు వేయాలని ప్రయత్నించారు.

ఒక్క నయాపైసా వృథా కాకుండా నేరుగా లబ్ధి దారులకు అందించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో ఎప్పుడైనా చెప్పిన పథకం సరైన సమయానికి ప్రజల వద్దకు వెళ్లాయా..?. చంద్రబాబు వదిలేసిన అప్పులు కూడా మేము చెల్లించాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలున్నా సీఎం వైఎస్ జగన్  క్యాలెండర్ ప్రకటించి పథకాలు అందించారు. 1.32 లక్షల కోట్ల డీబీటీ పథకాలు 6.80 కోట్ల మందికి అందించాం. ఒక్క అమ్మఒడి కిందనే ఏటా 50వేల కోట్లు తల్లుల అకౌంట్లలో పడుతున్నాయి. మీ బతుక్కి ఒక్క పథకం ఏదైనా ఒక్కటైన చెప్పగలరా...?. మా పథకాల వల్ల ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉన్నాయి. మా పరిపాలనను దేశమంతా పరిశీలిస్తోంది. ఇది టీడీపీకి మింగుడు పడటం లేదు...ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదు.

కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళింది. చంద్రబాబు పెట్టిన మూడున్నర కోట్ల అప్పును చెప్పకుండా మాపై నిందలు వేస్తున్నారు. కుటుంబం అబివృద్ది చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. మనకు వచ్చే ఆదాయాన్ని కూడా ఆపాలనే కుట్రలు కూడా చేసే స్థాయికి వచ్చారు. మీరు అప్పు ఎలా ఇస్తారు అంటూ కేంద్రానికి లేఖలు కూడా రాశారు. పోనీ మీ కాలంలో మీరేమన్నా అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపారా...?. తెలంగాణాలో అదనంగా ఉన్న స్థలాలు అమ్మితే మాట్లాడలేదు. కానీ.. ఇక్కడ మాత్రం గోల చేస్తారు.

ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన ఉన్న పార్టీ టీడీపీ. వారు చేస్తున్న దుష్ప్రచారంలో వాళ్లే మునిగి పోవడం ఖాయం. చరిత్రలో ఆలోచన చేయనంతగా ఉద్యోగాలు సృష్టించి భర్తీ చేస్తున్నాం. ఆయన హయాంలో పోస్టులన్నీ ఖాళీగా పెట్టి మాపై నిందలు వేస్తున్నారు. నూతన విద్యా విధానం వల్ల 30 వేల మందికి ప్రమోషన్స్ వస్తున్నాయి. పారదర్శకత లేని రోజులు వాళ్ళవి...మా వద్ద అంతా స్పష్టంగా ఉంటుంది. ఒక పార్టీ ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి టీడీపీ పార్టీ పనికివస్తుందని’’ సజ్జల ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top