రాహుల్‌ సమక్షంలో జూలై 2న కాంగ్రెస్‌లోకి: పొంగులేటి | Ponguleti Jupally Comments After Meeting With Rahul At Delhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సమక్షంలో జూలై 2న కాంగ్రెస్‌లోకి: పొంగులేటి

Jun 26 2023 5:36 PM | Updated on Jun 26 2023 6:12 PM

Ponguleti Jupally Comments After Meeting With Rahul At Delhi - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాహుల్‌ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు తెలంగాణకు చెందిన 35 మంది నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది. 

అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినా అనుకున్నది జరగలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవదేన వ్యక్తం చేశారు.

అందరితో చర్చించే నిర్ణయం: పొంగులేటి
బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక జూపల్లిలో కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరకున్నారనే విషయాలు తెలుసుకున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టేకంటే కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలనే ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. సర్వేల్లో ప్రజలకు బీఆర్‌ఎకు వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. అందరితో చర్చించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనకు పదవులివ్వలేదని పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

‘కల్వకుంట్ల కుటుంబం అనితీతితో ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదు. అనేక మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మాయల గారఢీ చేయడంలో కేసీఆర్‌ సిద్ధహస్తులు. జూపల్లి. నేను గత మూడు నెలలుగా సర్వేలు చేయించుకున్నాం. 80 శాతానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. ప్రజల నాడి గురించి ఆలోచించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. బీజేపీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మమ్మల్ని ఆహ్వానించాయి. కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాం.  కొత్త పార్టీ పెట్టినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. మేధావులు, స్థానిక నేతలతో చర్చించాం.  భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌ గాఫ్‌ బాగా పెరిగింది’ అని పొంగులేటి పేర్కొన్నారు. 

పాతాళానికి కేసీఆర్‌ పాలన: జూపల్లి
ప్రత్యేక తెలంగాణ లక్షలాది మంది యువకుల కల అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినట్లే పాలన ఉందనుకున్నామని, కానీ కేసీఆర్‌ పాలన పాతాళానికి పోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌వి అన్నీ మభ్యపెట్టే మాటలేనని దుయ్యబట్టారు. ఏ స్కీం పెట్టాలి, ఎలా గెలవాలన్నది కేసీఆర్‌ వ్యూమేనని.. స్కీంల వెనక ఎంతపెద్ద అవినీతి ఉందో తవ్వేకొద్ది తెలుస్తోందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పదవులు వదిలేసి పోరాడం. కానీ బీఆర్‌ఎస్‌లో మాకు కనీస గౌరవం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్‌ మనుషులుగా కూడా గౌరవించలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే ఉంది కాబట్టి అంబేద్కర్‌ పేరు జపిస్తున్నారు. మూడోసారి రాష్ట్ర ప్రజలను పాలించే హక్కు కేసీఆర్‌ కోల్పోయారు. మరోసారి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకూడదు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌ తర్వాత పొంగులేటి, జూపల్లి నేరుగా ప్రియాంక గాంధీ ఇంటికి బయల్దేరారు.

Advertisement
 
Advertisement
Advertisement