ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మ‌ల్లాది విష్ణు | Malladi Vishnu Fires On Chandrababu Govt Conspiracy Over Temple Lands | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మ‌ల్లాది విష్ణు

May 30 2025 3:15 PM | Updated on May 30 2025 5:34 PM

Malladi Vishnu Fires On Chandrababu Govt Conspiracy Over Temple Lands

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయ స్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని త‌న‌కు న‌చ్చిన వారికి కారు చౌక‌గా దేవుడి భూములు క‌ట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన‌ భూముల‌ను క్యాబినెట్‌ ఆమోదం లేకుండా, వేలం నిర్వ‌హించ‌కుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్ర‌భుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 139 విడుదల చేసింది.

అంతేకాకుండా ప్ర‌స్తుత లీజు దారుల‌కు మ‌రో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణ‌యం న్యాయ‌స్థానాల ఆదేశాల‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డమే. దేవాదాయ శాఖ భూముల‌ను లీజుకు ఇవ్వాలంటే టెండ‌ర్ విధానం ద్వారా బ‌హిరంగ వేలం నిర్వ‌హించి ఎవ‌రు ఎక్కువ‌కు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ను 33 ఏళ్ల‌కు మించి లీజుకు ఇవ్వ‌కూడ‌ద‌ని కోర్టులు గ‌తంలోనే స్ప‌ష్టంగా చెప్పినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. దేవాదాయ శాఖ భూముల‌ను త‌న వారికి అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేందుకు న్యాయ‌స్థానాల ఆదేశాల‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు.

ధార్మిక సంఘాల‌ను సంప్ర‌దించ‌లేదు
రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఖ‌రీదైన 4,244 ఎక‌రాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రూ. 5 ల‌క్ష‌ల విలువ దాటిన ప‌నుల‌ను నామినేష‌న్ ప‌ద్దతిన ఇవ్వ‌కుండా గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటే కూట‌మి ప్ర‌భుత్వం దానికి తూట్లు పొడుస్తోంది. దేవుడి భూములు లీజుకు ఇవ్వాలంటే వేలం పాట నిర్వ‌హించాల్సి ఉంటుంది. కానీ వేలం లేకుండా రూ. వేల కోట్ల విలువైన భూములను అప్ప‌గించ‌డానికి చట్ట సవరణ చేయడం దుర్మార్గం.

ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ద్వారా ఆల‌యాల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది.  హిందూ స‌మాజం, ధార్మిక సంఘాల‌ను క‌నీసం సంప్ర‌దించాల‌న్న స్పృహ కూడా ఈ ప్ర‌భుత్వానికి లేకుండా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేసేందుకు జీవో ఇస్తూ ఏకప‌క్ష నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కుట్ర‌ను వైయ‌స్సార్సీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. మ‌ఠాలు, స‌త్రాల పేరిట ఉన్న విలువైన భూముల‌ను సేవా సంస్థ‌ల ముసుగులో ఎలాంటి వేలం లేకుండా ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 139ని త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలి. హిందూ స‌మాజానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లంటే దేవాలయాల ఆస్తుల‌ను దోచుకోవ‌డ‌మేనా? ఒకవైపు ఆల‌యాల్లో వ‌రుస అప‌చారాలు జ‌రుగుతుంటే పట్టించుకోక‌పోగా మరో వైపు ఆల‌యాల ఆస్తుల‌నే కాజేసే కుట్ర‌లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement