● కూతురు నిశ్చితార్ధం కబుర్లు చెప్పి వస్తుండగా తండ్రి మృతి ● కోటనెమలిపురిలో విషాదం
రాజుపాలెం: కూతురు నిశ్చితార్ధానికి బంధువులను పిలిచేందుకు వెళ్లి తిరిగి వస్తూ తండ్రి అనంతలోకాలకు చేరుకోవడంతో శుభకార్యం జరుపుకోవాల్సిన కుటుంబంలో విషాదం నిండింది. మండలంలోని అనుపాలెం సమీపంలో ఈ దుర్ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని కోటనెమలిపురి గ్రామానికి చెందిన ఆదిమూలం కాశియ్య (45) భార్య పూజితతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు సోమవారం నిశ్చితార్ధం కావడంతో అంచులవారిపాలెం గ్రామంలోని బంధువులను ఆహ్వానించి తిరిగి ద్విచక్ర వాహనంపై కోటనెమలిపురికి బయలుదేరాడు. మార్గంమధ్యంలో మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం సమీపంలోని కోల్డ్స్టోరేజ్ వద్ద మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారితే శుభకార్యం జరుపుకోవాల్సిన కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది. ఎస్ఐ మణికృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.


