లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. గుంటూరు, కొత్తపేట, మల్లయ్యలింగంభవన్లో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎల్.శాంతి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సామాజిక భద్రత సౌకర్యాలు లేవని చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు వారి సమస్యలు వినడానికి కూడా ఇష్టపడడం లేదని విమర్శించారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వెలుగురి రాధా కృష్ణమూర్తి మాట్లాడారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షుడిగా ఎస్.వెంకటసుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా గుంటి వేణుగోపాల్, ఎల్.శాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమీ జాబి, డెప్యూటీ జనరల్ సెక్రెటరీ చాముండేశ్వరి, కోశాధికారి యు.మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వేదవతి, చందా మరై, సహాయ కార్యదర్శులుగా రత్న, కె.కల్పన, కుమారి జిల్లాల నుంచి ఐదు మంది చొప్పున ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య పిలుపు


