● రూ.6 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ పూర్ణచంద్రరావు
గుంటూరు రూరల్: మహిళ చనిపోగా ఆ ఇంట్లో మృతురాలికి చెందిన నగదు చోరీ కేసులో మరోమహిళను అరెస్ట్ చేసిన ఘటన కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరంలోని సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ కాకుమాను మండలం పాండ్రపాడులో దేవిరెడ్డి సుబ్బాయమ్మ(75) అనారోగ్యంతో గత నెల 12వ తేదీన మృతి చెందారు. మృతురాలికి పెదనందిపాడు మండలం రావిపాడులో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అందరూ పాండ్రపాడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మృతురాలికి చెందిన బంగారు వస్తువులు కనిపించకపోవటంతో ఇల్లంతా వెతికారు. ఎంతకి దొరకకపోవటంతో వెంటనే మృతురాలి మనుమడు వెంకటేష్, కాకుమాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతురాలికి చెందిన బంగారు వస్తువులను ఆమె బంధువు పాండ్రపాడుకు చెందిన దేవిరెడ్డి నాంచారమ్మ దొంగిలించినట్లు గుర్తించారు. నిందితురాలిని ఏటుకూరు బైపాస్వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షలు విలువ చేసే బంగారు చైన్, బంగారు తాడు, ఉంగరం, మంగళసూత్రం సుమారు 57 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టుకు అప్పగించగా రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన ప్రత్తిపాడు సీఐ పీ సుబ్బారావు, ఎస్ఐ హరికృష్ణ, కానిస్టేబుల్స్ నరసింహారావు, చిరంజీవి, సంసోన్, శ్రీకాంత్, శివపార్వతిలను అభినందించి రివార్డులు అందజేశారు.


