కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంగళగిరి మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ వర్షం కురిసింది. సగటున 2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో 12.4 మి.మీ., పెదకాకాని 5, తాడేపల్లి 3.6, తుళ్లూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది.
గుంటూరు ఎడ్యుకేషన్ రంగస్థలానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా బళ్లారి రాఘవ చిరస్థాయిలో నిలిచిపోతారని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటటౌన్: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్కు చెందిన షేక్ నాగూర్వలి(30) తాపీ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య మస్తాన్బీ చీరాల మండలం పందిళ్లపల్లి గ్రామానికి వెళ్లి రెండు రోజులు ఉండి వస్తానని భర్తకు చెప్పి శనివారం వెళ్లింది. ఆదివారం భార్య తను చెప్పినా వినకుండా వెళ్లిందని మనస్తాపం చెందిన నాగూర్వలి ఇంట్లో శ్లాబుకు ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన హుక్కు టవల్తో ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతా గమనించే లోపే మృతి చెంది ఉండటంతో నాగూర్వలి అక్క మస్తాన్బీ ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో జన విజ్ఞాన వేదిక(జేవీవీ)ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు.గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జేవీవీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి ఆగస్టు 27న, మండల స్థాయి సెప్టెంబర్ 11న, జిల్లా స్థాయి సెప్టెంబర్ 27న, నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయి సంబరాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు.


